ETV Bharat / international

ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం​

author img

By

Published : Jun 18, 2020, 4:52 AM IST

Updated : Jun 18, 2020, 8:39 AM IST

ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్​ఎస్​సీ)లోని 5 తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్​ 17న) ఎన్నికల్లో భారత్​ ఘనవిజయం సాధించింది. ప్లీనరీ సమావేశం లేకుండానే రహస్య బ్యాలెట్​ ద్వార ఎన్నికలు చేపట్టారు. ఈ సారి ఆసియా-పసిఫిక్ స్థానం నుంచి పోటీ చేస్తున్న భారత్​ 2021-22 కాలానికి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది.

UN Security Council
యూఎన్​ఎస్​సీ తాత్కాలిక సభ్యదేశంగా భారత్​

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)లో ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్‌ 17న) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత్​ ఘన విజయం సాధించింది. తాత్కాలిక సభ్య దేశాల కోసం ఎలాంటి ప్లీనరీ సమావేశం లేకుండానే రహస్య బ్యాలెట్​ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 2021-22 కాలపరిమితి​ కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఆసియా- పసిఫిక్‌ స్థానానికి భారత్‌ మాత్రమే పోటీలో ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఓటింగ్​లో పాల్గొన్న 192 సభ్య దేశాల్లో కావాల్సిన మెజారిటీ మూడింట రెండొంతులు (128) దాటుకుని 184 ఓట్లు సాధించింది భారత్​. ఈ ఎన్నికల్లో కెనడా ఓటమి పాలైంది. భారత్​తో పాటు ఐర్లాండ్​, మెక్సికో, నార్వేలు భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.

" అత్యధిక మద్దతుతో 2021-22 కాలానికి ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా భారత్​ను ఎన్నుకున్నాయి సభ్య దేశాలు. పోలైన 192 ఓట్లలో భారత్​కు 184 ఓట్లు వచ్చాయి."

- ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి​

2021-22 కాలపరిమితికి సంబంధించి ఆసియా- పసిఫిక్‌ స్థానం కోసం భారత్‌ అభ్యర్థిత్వానికి గత ఏడాది జూన్‌లోనే చైనా, పాకిస్థాన్‌ సహా ఈ విభాగంలోని మొత్తం 55 దేశాలు మద్దతు తెలిపాయి.

ఎనిమిదోసారి..

ప్రస్తుత ఎన్నికతో ఐరాస భద్రతా మండలికి భారత్​ ఎనిమిదో సారి ఎన్నికైనట్లయింది. భారత్‌ చివరిసారిగా 2011-2012లో ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా వ్యవహరించింది. అంతకుముందు 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92లో సభ్య దేశంగా ఉంది.

శాశ్వత సభ్యత్వంపై..

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్​ దశాబ్దాలుగా పోరాడుతోంది. అయితే 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. భద్రతా మండలిలో పది తాత్కాలిక సభ్యదేశాలకు సంబంధించి.. ఏటా ఐదు స్థానాలకు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరుగుతాయి. ఈ పది దేశాలను ప్రాంతీయత ఆధారంగా నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఐదు స్థానాలు, తూర్పు ఐరోపాకు ఒకటి, లాటిన్​ అమెరికా, కరీబియన్​కు సంయుక్తంగా రెండు, పశ్చిమ ఐరోపా, మిగతా దేశాలకు కలిపి 2 స్థానాలు కేటాయిస్తారు.

ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!

Last Updated : Jun 18, 2020, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.